byసూర్య | Tue, Jun 18, 2024, 07:56 PM
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమాన్మాది దాడికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణారహితంగా పొడవటంతో యువతి తీవ్రంగా గాయపడింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32)కు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో విడాకులు తీసుకున్నారు. గౌలిపురకు చెందిన మణికంఠ, శ్రావ్యలు చిన్ననాటి నుంచి స్నేహితులు ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని శ్రావ్యకు మణికంఠ ప్రపోజ్ చేశాడు.
అయితే కొన్ని రోజులుగా మణికంఠతో శ్రావ్య దూరంగా ఉంటోంది. ఆమె మరొకరితోను ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం పెంచుకున్న మణికంఠ ఇవాళ ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. తల్లిలేని సమయంలో ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో శ్రావ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. శ్రావ్య అరుపులు విన్న స్థానికులు.. ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.