byసూర్య | Tue, Jun 18, 2024, 07:55 PM
తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆసరా పెన్షన్లు పెంచకుండా అవ్వాతాతలను మోసం చేశారన్నారు. పక్క రాష్ట్రం ఏపీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట మీద నిలబడ్డారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పెన్షన్ రూ. 4 వేలకు పెంచుతూ సంతకం పెట్టారన్నారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాగానే డిసెంబర్ 9నే పెన్షన్ల పెంపుపై సంతకం పెడతానని చెప్పిన రేవంత్ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో సాధ్యమైనది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు.
ఏపీలో మార్చి, ఏప్రిల్, మేలో ఉన్న బకాయిలు కలిపి 7 వేల పెన్షన్ ఇస్తున్నారని అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడిచిందని.. నెలకు రూ. 2 వేల చొప్పున ఆరు నెలలకు రూ. 12 వేలు, ఈ నెల నాలుగు వేలు కలిపి మెుత్తం రూ. 16 వేల పెన్షన్ లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉండే అవ్వాతాతలు ఇద్దరికీ రెండు పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల హామీలో కాంగ్రెస్ చెప్పి ఓట్లు వేయించుకుందని.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇంకా అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు.
ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.., ఆచరణలో అమలు కావటం లేదని ఆయన విమర్శించారు. తమకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదని ఆశా వరర్లు ఇటీవల ధర్నా చేశారనన్నారు. ప్రభుత్వం చెప్పేది నిజమా ? లేక ఆశ వర్కర్లు చెప్పేది నిజామా? అని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీలకు కూడా సకాలంలో జీతాలు రావటం లేదని.. తెలంగాణ వ్యాప్తంగా 65 వేల మంది అంగన్వాడీ సిబ్బంది జీతం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.