byసూర్య | Sun, Jun 16, 2024, 07:40 PM
సాధారణంగా అయితే.. అందరికీ గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ.. తన భార్యకు మాత్రం గుండె కుడివైపు ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. తన భార్య మీద ఎలాంటి కనికరం లేకుండా.. ఇంటి నుంచి గెంటేశాడు. ఈ విషయంపై ఆ వివాహిత.. కోర్టుకు కూడా వెళ్లగా.. న్యాయస్థానం కూడా ఆమెను అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. భార్యను ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలని కోర్టు ఆ భర్తను ఆదేశించింది. అయినా సరే.. ఆ భర్త మాత్రం ఆ మహిళను ఇంటికి తీసుకెళ్లలేదు. అతను తీసుకెళ్లేదేంటీ.. నేనే వెళ్తా అంటూ తన తల్లిదండ్రులను తీసుకుని వెళ్లే.. ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన.. ఖమ్మంలో జరిగింది.
ఖమ్మం జిల్లాకు చెందిన భవాని అనే మహిళకు.. భాస్కర్తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భవాని తల్లిదండ్రులు మంచి కట్నకానుకలు ఇచ్చి భాస్కర్తో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత.. ఆమెకు గుండె కుడివైపు ఉందని, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పడంతో.. తనను ఇంటి నుంచి గెంటేశాడని బాధిత మహిళ తెలిపింది. ఇదే విషయంపై బాధిత మహిళ కోర్టును ఆశ్రయించగా.. గుండె కుడి వైపు ఉండటం వల్ల ఎటువంటి సమస్య ఉండదని, తక్షణమే ఆమెను తీసుకెళ్లాలని తీర్పు వెలువరించింది. అయినా సరే కోర్టు ఆదేశాలు బేకాతరు చేస్తూ.. తనను తీసుకెళ్లడానికి రాలేదని మహిళ వాపోయింది.
తాను తీసుకెళ్లకపోతే ఏంటీ.. నేనే స్వయంగా వెళ్తానంటూ.. తల్లిదండ్రులతో కలిసి వెళ్తే.. వాళ్లను బయట ఉంచి, తనను మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి.. లోపల తలుపులు వేసి అత్తమామలు ఘోరంగా కొట్టారని తెలిపింది. దాడి చేసే సమయంలో తన మామ పోలీస్ డ్రెస్లోనే ఉన్నారని.. తాను పోలీస్ అని.. తమను ఎవరు ఏం చేయలేరన్నారని చెప్పింది. మహిళ అని కూడా చూడకుండా కడపులో ఇష్టం వచ్చినట్టు తన్నారని.. మళ్లీ వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన మామ వెంకటేశ్వర్లు.. హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసుల నుంచి కూడా ఎటువంటి సహకారం అందడం లేదని, తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు కోరుకుంటుంది. ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.