byసూర్య | Sun, Jun 16, 2024, 07:36 PM
సంచలన నిర్ణయాలతో తమ మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఆయా శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే.. విద్యుత్ శాఖతో ప్రక్షాళన మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ ఆ తర్వాత పోలీస్ శాఖపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం (జూన్ 15వ తేదీన) 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. ఆదివారం రోజున మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీసీఎస్లో భారీగా బదిలీలు చేపట్టి అందరినీ అవ్వాక్కయ్యేలా చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఒకేసారి 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్వర్తులు జారీ చేశారు. వీరిని తక్షణమే మల్జీజోన్- 2కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ శాఖకు చెందిన అవినీతి ఆరోపణలతో ఏసీపీ ఉమామహేశ్వరరావు , సీఐ సుధాకర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ బదిలీలు ప్రాథాన్యత సంతరించుకున్నాయి.
కాగా.. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిబ్బంది మెుత్తాన్ని ఒకేసారి మార్చేశారు. హోంగార్డు స్థాయి నుంచి సీఐ వరకు మొత్తంగా 86 మంది సిబ్బందిని బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించిన సిబ్బందిని వీఆర్కు అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అయితే.. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ యాక్సిడెంట్ కేసుతో పాటు కీలకమైన కేసులకు సంబంధించిన వివరాలను మాజీ ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నట్లు గుర్తిచిన సీపీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుని అందరిని షాక్ అయ్యేలా చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో ఇలా స్టేషన్ సిబ్బంది మెుత్తాన్ని ఒకేసారి బదిలీ చేయం అదే తొలిసారి. ఒకప్పుడు ఇండియాలోనే బెస్ట్ పోలీసు స్టేషన్గా పంజాగుట్ట పోలీసు స్టేషన్కు అవార్డు రావటం గమనార్హం.