byసూర్య | Fri, May 31, 2024, 08:08 PM
సిద్దిపేట జిల్లాలో పురాతన నాణేలు బయటపడ్డాయి.. మద్దూరు మండలం నర్సాయపల్లిలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి పొలంలో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పెద్దగా ఉన్న గట్టును సన్నగా చేసేందుకు గడ్డపారతో తవ్వారు.. అయితే కూలీలకు ఓ రాతి డబ్బా కనిపించింది. కూలీలు వెంటనే పంచాయతీ కార్యదర్శి భాస్కర్కు సమాచారం ఇచ్చారు.
పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో మద్దూరు తహసీల్దారు, ఎంపీడీవో, చేర్యాల పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. అందరి సమక్షంలో ఆ రాతి డబ్బాను తెరిచి చూశారు.. అందులో 20 వెండి నాణేలు, 2 వెండి ఉంగరాలు దొరికాయి. ఈ నాణేలు, ఉంగరాలు కలిపి మొత్తం 238 గ్రాముల బరువు ఉన్నాయి. నాణేలపై పర్షియన్ భాషలో వివరాలు రాసి ఉండటం విశేషం. ఆర్కియాలజీ డిపార్డుమెంట్కు ఈ నాణేల ఫొటో తీసి పంపించగా.. వారు అసఫ్జాహీల కాలంనాటివి అని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అధికారులు పురాతన నాణేలు, ఉంగరాలను స్వాధీనం చేసుకుని.. గ్రామం నుంచి కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. పురాతన కాలంనాటి నాణేలు ఇప్పుడు దొరకడంతో.. స్థానికులు వీటిని చూడడానికి ఎగబడ్డారు. ఆ నాణేలను పట్టుకుని కొద్దిసేపు సంతోషపడ్డారు.