byసూర్య | Wed, May 22, 2024, 07:26 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గతరాత్రి తిరుమల చేరుకున్న ఆయన.. అక్కడే బస చేసి ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రేవంత్ రెడ్డికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు వేదఆశీర్వచనాలు అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు.
దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సౌకర్యార్ధం... కళ్యాణమండపాలు, సత్రాలు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి సహకరిస్తుందని తెలిపారు. ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపైనా కీలక కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ ఆకాంక్షించారు.