byసూర్య | Sun, May 05, 2024, 08:28 PM
రాష్ట్రంలో భానుడు భగభగలాడిపోతున్న వేళ.. వరుణుడు గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మామూలుగా కాదు.. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఎంట్రీ ఇచ్చి వడగండ్లు కురిపించాడు. ఇప్పటికే నేటి నుంచి నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపగా.. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. దీంతో ఎండ వేడితో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్టయింది. ముఖ్యంగా.. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. శుభవార్త వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. విషాదవార్త వచ్చి ఆ చెయ్యినే విరిచేసినట్టుగా.. అటు వర్షాలు వచ్చాయని ఆనందంగా ఫీలయ్యేలోపే.. పిడుగులు పడి ఇద్దరు మరణించారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో పిడుగుపడి దాసరి అజయ్ అనే 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అజయ్తో సహా రెండు గేదెలు కూడా చనిపోయాయి. అక్కడే ఉన్న యువకుడి తల్లి రేణుక కాస్తలో ప్రాణాలతో బయటపడింది. మరోవైపు.. మహబూబాబాద్ జిల్లాలో కూడా వడగండ్లు కురిశాయి. ములుగు జిల్లాలో కూడా భారీ వర్షం పడగా.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడగూడెంలో పిడుగుపాటుకు బాస బుల్లోడు(46) అనే రైతు మరణించాడు. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. కాగా.. ఈ అకాల వర్షాలతో.. ఆయా ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న వడ్లు తడిపోయాయి.
మరో నాలుగు రోజులు వర్షాలే..
అయితే.. ఈరోజు (ఆదివారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. కాగా.. రేపు (మే 6న) ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందులోనూ.. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 8న కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లో కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మే 9న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.