byసూర్య | Sat, May 04, 2024, 08:31 PM
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ యజమానిపై ఓయువకుడు దాడిచేసి కిరాతకంగా హతమార్చాడు. అందరూ చూస్తుడంగానే ఇనుపరాడ్డుతో దాడి చేసి చంపేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్ (54) కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ విల్లాస్లో నివాసం ఉంటున్నారు. అంజయ్యనగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్(28)తో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ అనే హోటల్ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూం కోసం ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
ఏడాది క్రితం స్టోర్ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి శ్రీనివాస్తో గొడవపడ్డాడు. ఎంబీఏ పూర్తి చేసి ఏ పని లేకుండా ఇంట్లో ఖాలీగా ఉండే మహేందర్ హోటల్ యజమానితో గొడవ పడటంతో స్థానికులు సర్దిచెప్పారు. శ్రీనివాసే మద్దతు తెలిపి మహేందర్ను సముదాయించారు. దీంతో తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్ అప్పటి నుంచి శ్రీనివాస్ను అంతమొందించాలనుకున్నాడు.
గురువారం (మే 2) సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్పై రాడ్డుతో ఒక్కసారిగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కుమారుడు వినయ్, హోటల్ సిబ్బంది మహేందర్ను అడ్డుకుని శ్రీనివాస్ను వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.