byసూర్య | Sat, May 04, 2024, 07:46 PM
ఆలోచనకు పదును పెడితే అద్భుతాలు చేయవచ్చు. వినూత్నంగా ఆలోచిస్తేనే.. కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. అందుకు ఉదాహరణగా నిలిచాడు హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వెల్డింగ్ వర్కర్ మహిపాల్ చారి. వినూత్నంగా ఆలోచించిన చారి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి విముక్తి కలిగించేందుకు విద్యుత్తో నడిచే ఎలక్ట్రికల్ ట్రాలీని తయారుచేశాడు.
ఈ ఎలక్ట్రిక్ ట్రాలీని నాలుగు బ్యాటరీల సాయంతో తయారు చేశాడు. వెయ్యి వాట్ల సామర్థ్యం గల మోటారు బిగించి మూడు టైర్లు, చిన్న ట్రాలీ వచ్చే విధంగా రూపొందించాడు. డ్రైవర్ పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ ట్రాలీని నాలుగు గంటల పాటు ఛార్జ్ చేస్తే.. 70 నుంచి 80 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందన్నారు. సుమారుగా 500 కేజీల వరకు బరువును ఈజీగా మోస్తుందని వెల్లడించారు. రైతులతో పాటు పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే తపనతో ఈ వాహనాన్ని తయారు చేసినట్లు మహిపాల్ వెల్లడించారు. రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మార్కెట్లలో పనిచేసే రిక్షా కార్మికులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ఎలక్ట్రిక్ ట్రాలీ వాహనాలు కావలసినవారు తనను సంప్రదిస్తే వారంలో తయారుచేసి ఇస్తానని.. రెండేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్ చేస్తానని మహిపాల్ చెబుతున్నారు. కాగా, గతంలో వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తయారుచేసి రాష్ట్రపతి చేతులు మీదగా మహిపాల్ పురస్కారం అందుకున్నాడు.