byసూర్య | Thu, May 02, 2024, 07:59 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయక్ గద్వాల విజయలక్ష్మీ ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో యూసఫ్గూడకు చెందిన లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లోని ఆమె నివాసంలో హల్చల్ చేశారు. సిబ్బందిని తోసుకుంటూ డైరెక్టుగా ఆమె వ్యక్తిగత గదిలోకి చొచ్చుకొని వెళ్లాడు. సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
తనకు నేర చరిత్ర ఉందని.. తన జోలికి రావొద్దని హెచ్చరించాడు. తనకు ఓ సమస్య ఉందని అదే విషయమై మేయర్ విజయలక్ష్మీతో చర్చించేందుకు వచ్చానని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో లేరు. ఆమె తండ్రి, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావుకు ఇటీవల సర్జరీ జరగ్గా.. ఆమె హాస్పిటల్లోనే ఉన్నట్లు తెలిసింది. మేయర్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రౌడీ షీటర్ లక్ష్మణ్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.