byసూర్య | Thu, May 02, 2024, 08:03 PM
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేడు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈనెల 6కు తీర్పును వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేయగా.. రిమాండ్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు.
మహిళ గా కవిత బెయిల్కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని కవిత తరపున న్యాయవాదులు గత నెల 22న వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్గా కవిత ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని.. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
అయితే కవిత తరపు న్యాయవాదుల వాదనలను వ్యతిరేకించిన సీబీఐ తరపు న్యాయవాదులు లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్గా ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని.. ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని వారు కోర్టుకు తెలిపారు. హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును, ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు ఆమెకు బెయిల్ మంజూరు అవుందని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూశాయి. అయితే బెయిల్పై తీర్పును న్యాయస్థానం ఈనెల 6కు వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.