byసూర్య | Thu, May 02, 2024, 07:44 PM
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇది వరకే విడదల చేసిన సంగతి తెలిసిందే. 'పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ'ల పేరుతోమేనిఫెస్టో విడుదల చేయగా.. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అధికారాన్ని కట్టబెట్టటంతో లోక్సభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ వాటినే కొనసాగించింది. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది.
కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. రేపు (మే 3) ఉదయం 11 గంటలకు తెలంగాణ స్పెషల్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారో సీఎం రేవంత్ వివరించనున్నారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, రహదారులు, రైల్వే లైన్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు దక్కనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో లోక్సభ స్పెషల్ మేనిఫెస్టోపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్క ఉత్కంఠ నెలకొంది.
లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన ముఖ్యమైన హామీలు
మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు
రైతుల కోసం పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
రైతులకు రుణమాఫీ
బిహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన
నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు
రైల్వేల ప్రైవేటీకరణను రద్దు
రూ.5000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
నిరుద్యోగ భృతి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ
విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
చిన్నతరహా పరిశ్రమల రుణాలను కొంతమేరకు మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ
దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ