byసూర్య | Thu, May 02, 2024, 07:41 PM
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిపోతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గపడుతుండటంతో.. ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా ఓ కాంగ్రెస్ మంత్రి కాపాడుతున్నారంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లిన బండి సంజయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు.
ఎన్నికల వేళ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెర లేపాడంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలింగించేలా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందన్న బండి సంజయ్... ఇప్పటికే ఆ కేసులో కొంతమంది పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని గుర్తు చేశారు. అంత పెద్ద కేసు ప్రస్తుతం కనీసం చర్చలో లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరు గార్చేందుకు, కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అదే మంత్రి.. కేసీఆర్, కేటీఆర్తో లాలూచి పడి, చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించాడంటూ ఆరోపించారు. తాను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడినే అని.. తనతో పాటు సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా బాధితులేనని చెప్పుకొచ్చారు, అందుకే.. హరీశ్ రావుకు ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్మెంట్లో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడని బండి సంజయ్ పేర్కొన్నారు. అయినా..ఈ కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యంగా ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న అశోక్ రావు.. ప్రభాకర్ రావుకు వియ్యంకుడని.. ఆ బంధుత్వంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ రావు ఇంట్లోనే ఉండి ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ కేసులో కాంగ్రెస్ నేతలకు కూడా సంబంధం ఉన్నట్లే అని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రాబోతుందని తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు గెలబోతుందన్నారు.ఈన కేసు సీబీఐకి అప్పగిస్తే తన వద్ద ఉన్న ఆధారాలను వాళ్లకే ఇస్తానని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.