byసూర్య | Thu, May 02, 2024, 07:14 PM
హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం శుభవార్త వినిపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. ఈ క్రమంలో.. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. రాత్రి 12:15 గంటలకు చివరి ట్రైన్ ప్రారంభమై.. 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని మెట్రో యాజమాన్యం తెలిపింది. అయితే ఉప్పల్ స్టేడియం - ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి మాత్రం వీలుండదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరుకున్నట్టు యాజమాన్యం తెలిపింది. అయితే.. ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరిన సందర్భంతో పాటు కస్టమర్ లాయల్టీ స్టాల్, గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను అమీర్ పేట మెట్రో స్టేషన్లో ప్రారంభించనున్నారు. మే 3వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మరోవైపు.. ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 విజయాలతో టేబుల్ టాపర్గా ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.