byసూర్య | Thu, May 02, 2024, 07:11 PM
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గపడుతుండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బహిరంగ సభలు, రోడ్ షోలతో కీలక నేతలంతా తమ ప్రసంగాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కష్టపడుతుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ప్రచారం నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై, ఆయా పార్టీల నేతలపై విమర్శలు, ఆరోపణలతో పాటు ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కూడా అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కేసీఆర్ను టార్గెట్ చేసిన కాంగ్రెస్.. గులాబీ బాస్ను పోలి ఉన్న ఓ నటున్ని తీసుకొచ్చి.. కారు టైర్లు పంచర్ అయినట్టుగా, ప్రజలు తిడుతున్నట్టుగా కొన్ని పొలిటికల్ క్యాంపెయిన్ యాడ్స్ షూట్ చేసి ప్రజల్లోకి వదిలారు. ఈ యాడ్స్ ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపించాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీపై సెటైరికల్ యాడ్స్ ఎక్కు పెడుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ "ఢిల్లీ దర్బార్" పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో.. జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు ఇస్తూ, తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని తెలిపేందుకు గాడిద గుడ్డు ఇచ్చినట్టుగా వీడియోలో చూపించారు.
ఈ వీడియోలో నరేంద్ర మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ పాత్ర దారులు కనిపిస్తుండగా.. మోదీ పాత్ర వేసిన వ్యక్తి మాత్రం అచ్చంగా సూట్ అయ్యాడు. అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన గుజరాజ్కు చెందిన పానీపూరీ మోదీనే తీసుకొచ్చి ఈ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కూడా జనాల్లోకి వెళ్లి.. అసెంబ్లీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
ఈ వీడియోతో పాటు.. "సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది అంటే ఇదేనేమో. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని, గుజరాత్కు అప్పనంగా అప్పజెబుతుంది ఢిల్లీ దర్బార్. పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే.. బీజేపీ "గాడిద గుడ్డు" ఇచ్చిందని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే "గాడిద గుడ్డు" ఇచ్చిందని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడిగితే "గాడిద గుడ్డు" ఇచ్టిందని, కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం చేయమంటే అక్కడ కూడా గాడిద గుడ్డేనని.. మేడారం జాతరకు జాతీయహోదా ఇవ్వమంటే అక్కడ కూడా గాడిద గుడ్డేనని.. కాంగ్రెస్ విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు… పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద "గాడిద గుడ్డు" అని కాంగ్రెస్ రాసుకొచ్చింది.