![]() |
![]() |
byసూర్య | Tue, Apr 23, 2024, 08:05 PM
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెల 22న ఓ ఫ్లాటు రిజిస్ట్రేషన్ విషయంలో ఏసీబీకి పట్టుబడిన సమయంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమా నివాసంతో పాటు ఆమె సోదరుల పేరున ఉన్న ఐదు ఇండ్లు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో ఒకేసారి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఆదాయనికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. తన కుటుంబసభ్యుల పేరున ఇండ్లు, భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
తస్లీమా ఆమె కుటుంబ సభ్యుల పేరున రూ.2.07 కోట్ల విలువైన ఐదు ఇండ్లు, రూ.12 లక్షల విలువైన ఆరు ఇండ్ల స్థలాలు, ములుగులో రూ.20.40 లక్షల విలువైన 3 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.1.92 లక్షలు, రూ.98,787 బ్యాంక్ బ్యాలెన్స్, ఒక కియా కారు, రెండు బుల్లెట్బైక్లు ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ సుమారు రూ.2.94 కోట్లుగా గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొవిడ్ లాక్డౌన్ సమయంలో పేదలకు సాయం చేస్తూ తస్లీమా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. లాక్డౌన్లో అప్పటి ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కతో కలసి కొండల్లో మూటలు మోస్తున్న తస్లీమా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో సైకిల్ కూడా వెళ్లని మారుమూల గిరిజన ప్రాంతాలకు మూటలు మోసుకుంటూ వెళ్లి నిత్యావసర సరకులు పేదలకు అదించారు. సుమారు 16 కి.మీ.లు నడుచుకుంటూ.. మాడు వాగులు దాటి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. కాగా అప్పట్లో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. నాడు తన సేవతో సెన్సేషన్గా మారిన తస్లీమా.. అవినీతి కేసులో చిక్కుకొని అప్రతిష్ఠపాలయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం తస్లీమా కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.