అహంకారమే ఓడించింది, కేసీఆర్‌ ఆ అవకాశం ఇవ్వలేదు.. మండలి ఛైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Sun, Apr 21, 2024, 07:29 PM

అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారమే బీఆర్ఎస్ పార్టీని ఓడించిందంటూ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీపై గుత్తా సుఖేందరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసి.. చర్చకు తెరలేపారు. ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే అహంకారం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని గుత్తా విశ్లేషించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో సమన్వయలోపం ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ అయినా, బీఆర్‌ఎస్‌ అయినా పార్టీకి ఇప్పటికీ సరైన నిర్మాణం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.


నల్లగొండ జిల్లా ఊరుమడ్లలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని.. నియోజకవర్గానికి ఆయనే సీఎం అనే పద్ధతిని కేసీఆరే నడిపించారని ఆరోపించారు. ఎంపీలైతే వారి అభివృద్ధి నిధుల్లో మూడున్నర కోట్లు నియోజకవర్గాలకు ఇచ్చేయాలని.. కోటిన్నర వారి దగ్గరే పెట్టుకోవాలని.. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు పిలిస్తేనే వెళ్లాలని.. పిలవకపోతే వెళ్లొద్దని కేసీఆర్‌ చెప్పేవారని గుత్తా కీలక విషయాలు బయటపెట్టారు. ఎమ్మెల్సీల పరిస్థితి అయితే కరివేపాకు కంటే అధ్వానంగా ఉండేదంటూ సంచలన విషయాలు తెలిపారు గుత్తా.


బీఆర్ఎస్ పార్టీలో.. ఉద్యమకారుల పేరుతో చాలా మంది కోటీశ్వరులయ్యారంటూ గుత్తా ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కొందరు లిల్లీపుట్‌లను తయారుచేశారని విమర్శించారు. పల్లీ, బఠానీలు అమ్ముకునే నేతలు కోట్లకు పడగలెత్తారంటూ కీలక ఆరోపణలు చేశారు. త్వరలో వారి బండారం మొత్తం బయటపెడతానని గుత్తా వెల్లడించారు. తనను విమర్శించే బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో భారీ అంచనాలున్నాయని.. ఖజానా ఖాళీగా ఉండడం వల్ల సర్కారుకు కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలంటూ గుత్తా చెప్పుకొచ్చారు.


బీఆర్‌ఎస్‌ పాటించిన కొన్ని పద్ధతులే పార్టీ నిర్వీర్యానికి కారణమయ్యాయని.. అందుకే అధికారం కోల్పోయిన 3 నెలల్లోనే పేకమేడల్లా కూలిపోవాల్సి వచ్చిందని గుత్తా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించిందో.. ఎవరిని మంత్రులను చేసిందో వారి వల్లే ఎక్కువగా నష్టం జరిగిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35 మందిని మార్చితే ప్రభుత్వం వచ్చేదనే అభిప్రాయం చాలామందికి ఉందన్నారు గుత్తా.


ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినా ఓడినా.. అందుకు కారణాలేంటనే సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని.. ఈ విషయాలను తాను, హరీశ్‌రావు.. కేటీఆర్‌కు చాలాసార్లు చెప్పామని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. అయితే కేసీఆర్‌కు చెప్పే అవకాశం మాత్రం ఇవ్వలేదని గుత్తా అసహనం వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని.. తన కుమారుడు అమిత్‌ రెడ్డి ప్రస్తుతం వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడే ఆలోచన చేస్తారన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున తనకు పార్టీ ఉండదంటూ.. గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM