byసూర్య | Sun, Apr 14, 2024, 04:14 PM
హైదరాబాద్లో నీటి కొరత సృష్టించేలా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ వార్నింగ్ ఇచ్చారు. సిటీలో నీటి సరఫరాలో కొందరు ఉద్యోగులే కావాలని ఆటంకాలు సృష్టిస్తున్నారనే ప్రచారంపై ఆయన సీరియస్గా స్పందించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ల బుకింగ్స్, డెలివరీ, లైన్ మెన్ల పనితీరు వంటి అంశాలపై వాటర్ బోర్డు ఉన్నాతాధికారులతో చర్చించారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని దానకిశోర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ముగ్గురు లైన్మెన్లను సస్పెండ్ చేసినట్టు వాటర్ బోర్డ్ ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు. రోజుకు 7 వేల ట్యాంకర్ల నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. సిటీలో 30 వేల ఇండ్ల నుంచే వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.
తాగునీటి సరఫరాలో అవాంతరాలు రావొద్దని, ట్యాంకర్ల కొరత కూడా లేకుండా చూడాలని అధికారులకు దానకిశోర్ సూచించారు. భవిష్యత్ అవసరాల మేరకు నీటిని శుద్ధి చేసేందుకు మీరాలం, ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ వంద శాతం పని చేసేలా మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్యాంకర్ డెలివరీ సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెలివరీ టైమ్ను 12 గంటలకు తగ్గించాలన్నారు. 750 ట్యాంకర్లతో పాటు అదనంగా 5 కేఎల్ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.