byసూర్య | Thu, Apr 11, 2024, 03:50 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.తాజాగా, కవితను గురువారం ఈ కేసులో సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కాగా, లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను ప్రశ్నించింది. ఇదే కేసులో గతంలో ఆమెను సీబీఐ ప్రశ్నించింది. తాజాగా, కవితను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. మరోవైపు, కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనుండగా.. తాజాగా సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది.