byసూర్య | Mon, Apr 08, 2024, 06:21 PM
ముస్లీం సోదరులకు ఇది పవిత్ర రంజాన్ మాసం. రోజంతా ఉపవాసం ఉండి.. సూర్యాస్తమయం తర్వాత తమ ఉపవాసాన్ని వదులుతారు. ఈ క్రమంలో.. సన్నిహితులకు, బంధువులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. అయితే.. ఈ ఇఫ్తార్ విందులో అందరూ.. ఎంతో సంతోషంగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఇలా.. వీఐపీలకు ఇచ్చిన ఓ ఇఫ్తార్ విందుకు ఓ జేబుదొంగ రావటమే కాదు.. లీడర్ల జేబుల మీద తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. చేతికి దొరికిందల్లా లాగేస్తూ.. గట్టిగానే సర్దేశాడు. చివరికి.. దొరికిపోయి దేహశుద్ధి చేయించుకున్నాడు. అయితే.. ఆ దొంగ జేబుల్లో చూసి.. అందరూ షాక్ అయ్యారంటే.. ఎంత చేతివాటం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన.. రాజేంద్రనగర్లో జరిగింది.
శివరాంపల్లిలోని ఎస్ఎస్సీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ విభాగం ఛైర్మన్ ఫయిమ్ ఖురేషి ఆధ్వర్యంలో వీఐపీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు పలువురు మైనారిటీ పెద్దలతో పాటు రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విందుకు ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.
అయితే.. రాజకీయ నాయకుల వెంట కార్యకర్తల ముసుగులోనే ఓ కేటుగాడు కూడా ఎంట్రీ ఇచ్చారు. విందుకు వచ్చింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కావటంతో.. గట్టిగానే గిట్టుబాటు అవుతుందనుకున్నాడు. ఇంకేముంది.. అందరూ విందు హాడావిడిలో ఉంటే.. వాడు మాత్రం తన చేతివాటం చూపిస్తూ.. దొరికిన జేబుకల్లా కన్నం పెట్టేస్తున్నాడు. వీఐపీల సెక్షన్లోకి వచ్చి నాయకుల జేబులకు కన్నం వేశాడు. ఎవరూ చూడట్లేదన్న నమ్మకంతో దర్జాగా చోరీలు చేస్తుండగా.. అతని బాగోతం కొంత మంది కార్యకర్తల కంటపడింది. ఇంకేముంది.. ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని.. పూర్తిగా దేహశుద్ధి చేశారు. వాడి జేబులన్నీ చెక్ చేయగా.. అందులో.. 8 ఖరీదైన మొబైల్ ఫోన్లతో పాటు 2 లక్షల వరకు డబ్బు దొరికింది. దీంతో.. నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.