byసూర్య | Fri, Feb 23, 2024, 09:41 PM
తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పూట చలి చంపేస్తుండగా.. మధ్యాహ్నం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఫిబ్రవరి నేటి నుంచి ఈనెల 26 తేదీల్లో తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలతో పాటు.. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ అంచనాలు నిజమైతే.. ఎండ తీవ్రతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు ఉపశమనం దక్కనుంది.