byసూర్య | Tue, Nov 28, 2023, 10:08 PM
చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని.. కానీ, చంద్రబాబు ఒప్పుకోలేదని సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందని... అందుకే బాబును కలిసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నించారని చెప్పారు. బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరును అందరూ గమనించారని అన్నారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండటం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని నారాయణ చెప్పారు. అందరికి సన్ స్ట్రోక్ ఉంటుందని... కానీ, కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేస్తోంది.