byసూర్య | Mon, Sep 25, 2023, 07:40 PM
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే షర్మిల కూడా.. అటు డీకే శివకుమార్తో పలుమార్లు భేటీ అయ్యారు. కాగా.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం పక్కా అన్న వార్తలు వచ్చాయి. కానీ.. దానికి సంబంధించిన ప్రక్రియ కానీ.. ప్రకటన కానీ.. ఏదీ అధికారికంగా బయటకు రాలేదు.
అయితే.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే స్వాగతిస్తామంటూ హస్తం పార్టీ పెద్దలు ఆహ్వానిస్తుండగా.. మరికొందరు బయటి నుంచి వచ్చినవాళ్లు మాత్రం... గొంతులో ప్రాణముండగా రానివ్వనంటూ సవాళ్లు చేస్తున్నారు. అయితే.. అధిష్ఠానమే ఓకే చేసిన తర్వాత వీళ్ల ముచ్చటేంది అనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో.. ఇంకా ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవటం పలు చర్చలకు దారి తీస్తోంది. అయితే.. షర్మిల రాకను వ్యకతిరేకిస్తోన్న వర్గం.. అడ్డంకులు సృష్టిస్తోందని.. అందుకే ఇంకా అధికారిక ప్రకటన రావట్లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, పొత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై కూడా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనంపై ఈ నెల 30వ తేదీ లోపు నిర్ణయం తీసుకుంటామని షర్మిల స్పష్టం చేశారు. ఒకవేళ విలీనం లేకుంటే మాత్రం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఒంటరిగానే బరిలోకి దిగుదామని నేతలకు కీలక సూచనలు చేశారు షర్మిల. కార్యవర్గం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
అయితే... షర్మిల చేసిన తాజా కామెంట్స్ అటు కాంగ్రెస్లోనూ ఇటు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో తీవ్ర చర్చకు తెరలేపింది. ఒకవేళ.. షర్మిల సింగిల్గా అన్ని ప్రాంతాల నుంచి బరిలోకి దిగితే మాత్రం.. ఆమెకు ఎలాంటి లాభం లేకపోయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదు. వచ్చే పదో పరక ఓట్ల నుంచి షర్మిలకు కొన్ని ఓట్లు పడటంతో.. ఇది కచ్చితంగా కాంగ్రెస్కు పెద్ద దెబ్బే అన్న వాదన వినిపిస్తోంది. అలాకాదని పార్టీని విలీనం చేస్తే.. తనకు పట్టున్న స్థానాల్లో తమ పార్టీ వాళ్లకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు పెడితే.. ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి రాగాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఎటు పెట్టినా కాంగ్రెస్కే పిడి పడనుండటంతో.. మరి అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.