byసూర్య | Sun, Sep 24, 2023, 06:02 PM
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద గణేషుడు.. ఖైరతాబాద్ వినాయకుడు. ఆయనను దర్శించుకునేందుకు నగరవాసులు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లోనే ఖైరతాబాద్ గణేషున్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటే.. ఇక సెలవు రోజు ఇంకెలా ఉంటుంది. ఆదివారం రోజున ఖైరతాబాద్కు ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు.. ఉదయం నుంచే భక్తులు భారీ ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. అయితే.. నగరంలోని వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు తరలివచ్చినట్టు తెలుస్తోంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు.. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలిరావటంతో... ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆదివారం కావడంతో నగరవాసులు కుటుంబాలతో సహా గణేషున్ని దర్శించుకునేందుకు విచ్చేశారు. యువత కూడా పెద్ద ఎత్తున గణనాయకున్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వచ్చారు. దీంతో.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు గణేష్ మహరాజ్ కీ జై నినాదాలతో మారుమోగింది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
మరోవైపు.. ఖైరతాబాద్కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోవటంతో.. వాళ్లను కంట్రోల్ చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్జామ్ కావటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. మెట్రోలు, ఆర్టీసీ బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అయితే.. జనంతో నిండిపోయింది.