byసూర్య | Sat, Sep 23, 2023, 09:06 PM
హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లులూ గ్రూప్.. సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. లూలూ మెగా షాపింగ్ మాల్ను కూకట్పల్లిలో నిర్మిస్తుండగా.. తెలంగాణలో ఇదే మొదటి లులూ మాల్. దేశంలోని అతిపెద్ద షాపింగ్స్ మాల్స్లో ఒకటైన ఈ లులూ మాల్ ఏకంగా.. 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. కేపీహెచ్బీలో ఉన్న మంజీరా మాల్ను లులూ గ్రూప్ రీబ్రాండింగ్ చేస్తుండటం గమనార్హం. ఈ రీబ్రాండింగ్ కోసం సంస్థ.. రూ.300 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే.. ఈ లులూ మాల్ను ఆగస్టులోనే ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. నిర్మాణ పనులు కొంత ఆలస్యం కావటంతో.. సెప్టెంబర్ 27న ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
ఈ లులూ మాల్లో 200కి పైగా దుకాణాలు ఉండనున్నాయి. అందులో 75కి పైగా లోకల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉండనన్నట్టు చెప్తున్నారు. కేవలం దుకాణాలే కాదండోయ్.. సినీ ప్రియుల కోసం 5 థియేటర్లను కూడా నిర్మించారు. ఈ ఐదు స్క్రీన్లలో కలిపి మొత్తం 1400 మంది ప్రేక్షకులు సినిమాలు చూడొచ్చంటా. వీటితో పాటు మల్టీ కుషన్ ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. దేశీయ, విదేశీ బ్రాండ్లతో కూడిన రిటైలర్లు, ప్రేయర్ హాల్, మెడికల్ సెంటర్ కూడా ఇందులో ఉంటాయి. ఇదంతా ఒకఎత్తయితే.. ఇందులో పార్కింగ్ కోసం కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒకేసారి 3 వేల కార్లను పార్కింగ్ చేసేలా నిర్మాణం చేశారు.
కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన లులూ మాల్ కాకుండా.. ఎగుమతులే లక్ష్యంతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా లులూ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటును 200 కోట్లతో రోజుకు 60 టన్నుల మాంసం ఉత్పత్తి సామర్థ్యంతో చెంగిచర్లలో ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో రూ.3500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ గత నెలలో ప్రకటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఈ లులూ మాల్ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. రూ.2500 కోట్లతో హైదరాబాద్లో మరో డెస్టినేషన్ మాల్ ఏర్పాట్ చేయనున్నట్లు యూసుఫ్ అలీ తెలిపారు. హైదరాబాద్ శివార్లతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కూడా మినీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.