byసూర్య | Sat, Sep 23, 2023, 10:01 PM
తెలంగాణలో మరో దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వెల్స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ కంపెనీ.. రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ బ్రాండ్ తయారీ యూనిట్ను నెలకొల్పనునుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సింటెక్స్ కంపెనీ పెట్టుబడితో సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నట్టు చెప్పుకొచ్చారు. సింటెక్స్ నెలకొల్పనున్న తయారీ యూనిట్లో.. సింటెక్స్ వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనున్నారు.
ప్లాంట్ నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్తో పాటు వెల్స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గొయెంకా పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టి.. విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న వెల్స్పన్ గ్రూప్.. మరింత విస్తరిస్తుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ కూడా తెలంగాణలో రూ.350 కోట్లతో పెట్టుబడి పెడుతున్నందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కారణంగా పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.