byసూర్య | Wed, Sep 20, 2023, 07:44 PM
ప్రస్తుతం వైద్యం ఎంత ఖరీదైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న జబ్బు చేసినా వేలకు వేలు ఖర్చవుతుంది. జబ్బు తీవ్రతను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో బిల్ వేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలో ఓ రోజుల పసికందును చికిత్స కోసం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. బిల్లు తడిసిమోపడవంతో.. చెల్లించలేక పాపను హాస్పిటల్లోనే వదలేసి ఇంటికి వచ్చారు. అంత డబ్బు ఎలా చెల్లించాలంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీకి చెందిన నితిన్, రవళిక దంపతులది ప్రేమ వివాహం. ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రోజువారీ కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఈ నెల 7న పండంటి పాప జన్మించింది. పుట్టిన తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తటంతో నిలోఫర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ వెంటిలేటర్పై ఉంచి చిన్నారికి వైద్యం అందించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆ తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత శిశువు శరీరంలో మార్పు రావటాన్ని తల్లిదండ్రులు గమనించారు. వెంనటే స్థానికంగా ఉన్న ఓ డాక్టర్కు చూపించారు. చిన్నారిని పరిశీలించిన డాక్టర్.. మెరుగైన చికిత్స అవసరమని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించాడు.
దీంతో పసికందును పిసల్బండలోని ఓ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేశారు. అక్కడ చిన్నారికి మెరుగైన వైద్యం అందించారు. ట్రీట్మెంట్కు రూ.1.16 లక్షలు బిల్లు వేశారు. అయితే నిరుపేదలనై నితిన్, రవళిక దంపతులు వద్ద ఉన్న రూ.35 వేలు ఆసుపత్రిలో చెల్లించారు. మిగతా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో చిన్నారిని ఆసుపత్రిలోనే వదిలేసి ఇంటికి వచ్చారు. తాము అంత డబ్బు కట్టలేమని.. నిరుపేదలమని తమ పాపను ఎలా ఇంటికి తీసుకొచ్చేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.