byసూర్య | Wed, Sep 20, 2023, 07:11 PM
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎట్టకేలకు మోక్షం లభించనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రమంత్రి మండలి సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రోజు బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ప్రస్తుతం బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లులో పొందుపరిచిన అంశాల ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. దాదాపు 40 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను.. 5 నుంచి 6 సీట్లు మహిళా కోటా కిందకు వెళ్లనున్నాయి.
అయితే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కవున్న నియోజవర్గాలను వారికి కేటాయించనున్నారు. జనగణన, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రిజర్వేషన్ అమల్లోకి రానుంది. అంటే 2029 ఎన్నికల్లో మహిళలుకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇక తెలంగాణలో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గం కూడా మహిళలకు రిజర్వ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేటీఆర్ అక్కడి నుంచి పోటీ చేయటానికి వీలు కదరదు. ఈ అంశంపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మాదాపూర్లో అంతర్జాతీయ టెక్పార్క్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడిన కేటీఆర్..మన జీవితాలు చాలా చిన్నవని.. తన పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు. మహిళా కోటాలో తన సీటును వదులుకోవటానికి సిద్ధమేనని బిల్లును పూర్తిగా తాను స్వాగతిస్తుననట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పెట్టుబడులకు నగరం అనువైన ప్రాంతమని అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని చెప్పారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు నగరం నుంచే వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.