byసూర్య | Wed, Sep 20, 2023, 07:15 PM
కరీంనగర్ మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బైక్ చక్రంలో చున్నీ ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. బైక్ రన్నింగ్లో ఉండగా.. వెనుక కూర్చున్న మహిళ చున్నీ టైర్లో చిక్కుకోవటంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నగురం గ్రామానికి చెందిన పూజిత (25), జగన్ రావు దంపతులు. వీరికి నిత్యశ్రీ, అజేశ్రీ ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరికీ జ్వరం రావటంతో జమ్మికుంటలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలని అనుకున్నారు. భర్త జగన్ రావుతో కలిసి బైక్పై పిల్లలను ఎక్కించుకొని సోమవారం (సెప్టెంబర్ 18న) జమ్మికుంటకు బయల్దేరారు.
ధర్మారం సమీపంలోకి చేరుకోగానే.. వెనుక కూర్చున్న పూజిత చున్నీ బైక్ టైర్లో చిక్కుకొని రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యానికి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. అయితే అల్లుడు జగన్ రావు అతివేగంగా బైక్ నడపడంతోనే తన కూతురు మృతి చెందిందని అత్త మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.