byసూర్య | Wed, Sep 20, 2023, 07:06 PM
యాదాద్రి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం స్టేజి వద్ద బస్సు బోల్తా పడింది. మోత్కురు - తిరుమలగిరి రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు నుంచి హైదరాబాద్కు ఇవాళ ఉదయం బస్సు బయల్దేరింది. బస్సులో మెుత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు.
అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్దకు రాగనే బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా తయారైంది. స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్లకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతి వేగంగా బస్సు నడపటంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించటమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.