‘కేసీఆర్ అంటే.. నీళ్లు. కేసీఆర్ అంటే.. అమ్మ తీరు అలోచించడం: కవితా

byసూర్య | Wed, Jun 07, 2023, 09:54 PM

‘కేసీఆర్ అంటే.. నీళ్లు. కేసీఆర్ అంటే.. అమ్మ తీరు అలోచించడం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్‌డ్యాములు, రిజర్వాయర్లని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేరుకు కొత్త అర్థం చెప్పారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు.. కాళేశ్వర చంద్రశేఖర్ రావు. శివుని నెత్తిన గంగమ్మ ఉంటే... తెలంగాణ నెత్తి మీద కాళేశ్వర గంగను తీసుకొచ్చారు కేసీఆర్’ అంటూ కీర్తించారు కవిత. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లో జరిగిన ‘సాగునీటి దినోత్సవం’లో పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.


‘కేసీఆర్ అంటే.. నీళ్లు. కేసీఆర్ అంటే.. అమ్మ తీరు అలోచించడం. మన బిడ్డలకు ఏమైనా సుస్తి చేస్తే వాళ్లు మంచిగయ్యేదాక వదిలిపెట్టం మనం. అమ్మ ప్రేమ అలాంటిది. కేసీఆర్‌ది కూడా తెలంగాణ పట్ల, రైతుల పట్ల తల్లి ప్రేమ. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇచ్చారు. ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసే సమయంలోనే రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం లాంటి ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - ఒక భగీరథ ప్రయత్నం’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి కేసీఆర్ దు:ఖించిన తీరును నేను చూశా. నాడు ఎండిపోయిన పాలమూరు ఇవాళ పచ్చని పైట కప్పుకుంది. సీఎం కేసీఆర్ సంతోషిస్తున్నారు’ అని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోనే కాదు.. భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. 81 మీటర్ల నుంచి 613 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అతిగొప్ప ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి. కానీ, దేశానికి గర్వకారణంగా ఉండే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కూడా కల్పించకపోవడం సిగ్గుచేటు’ అని కవిత ధ్వజమెత్తారు. కేంద్రం ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పరోక్షంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ విసిరారు.


కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువ లబ్ది పొందింది నిజామాబాద్ జిల్లానేనని కల్వకుంట్ల కవిత చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రాజెక్టులు లేని కాలంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు ఉండేది. ఆ ప్రాజెక్టు కాలువల ద్వారానూ నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులను చూశాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్సీని పునరుజ్జీవనం చేసుకున్నాం. హల్దీవాగుతో నిజాం సాగర్‌ను నింపుకున్నాం. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా చెరువులన్నీ నిండుకుండలా ఉండాలని, మత్తడి దుంకాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందు కోసం సాగునీటి రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు’ అని కవిత కొనియాడారు.


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ భేటీ అయ్యి వారిని సీఎం కేసీఆర్ ఒప్పించారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడు నిజమైన రాజకీయ నాయకుడు. నాడు మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ, ఆ రోజు ఒప్పందం చేసుకోవడం వల్లనే నిజామాబాద్ జిల్లా నిండుకుండగా మారింది, అన్నపూర్ణగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో లక్షా 81 వేల ఎకరాలు కాళేశ్వరం జలాలతో సాగవుతున్నాయి. చెక్ డ్యాముల నిర్మాణం వల్ల జిల్లాలో నీటి మట్టం 15 మీటర్లు పెరిగింది’ అంటూ కవిత చెప్పుకొచ్చారు.


ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో గతంలో జరిగినదాని కంటే మంచి ఇప్పుడే జరుగుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘నాటి ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరపలేదు. ఏనాడూ నిబద్ధత చూపించలేదు. నీటి వనరులు లేకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి వేల కోట్లు దోపిడీ చేశారు. నాటి కాంగ్రెస్ పాలనలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా నిజామాబాద్ జిల్లాకే చెందిన సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ ఘోరాలు జరిగాయి. నాటి పాలకుల చేతిలో సుదర్శన్ రెడ్డి కీలు బొమ్మగా ఉండేవారు’ అని కవిత విమర్శించారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM