byసూర్య | Sat, Jan 28, 2023, 11:59 AM
రాష్ట్రంలో సుమారు1, 366 సర్కారు స్కూళ్ల మూతకు రంగం సిద్ధమైంది. పిల్లలు లేరనే సాకుతో ఆయా బడుల్లో టీచర్ల ఖాళీలను ప్రభుత్వం చూపించడం లేదు. దీంతో జీరో ఎన్రోల్మెంట్ఉన్న బడులు శాశ్వతంగా మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వాటిల్లో టీచర్ పోస్టులూ మాయం కానున్నాయి. స్టేట్లో 26 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో ఈ ఏడాది1, 366 స్కూళ్లలో స్టూడెంట్స్ చేరలేదు. గతంలోనూ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఉన్నా. కరోనా నేపథ్యంలో వందలాది స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం అవి కొనసాగుతున్నాయి. అప్పట్లో ఆయా స్కూళ్లకు శాంక్షన్ పోస్టులు ఉండటంతో, తిరిగి ఆ టీచర్లతో వాటిని నడిపించారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లలో టీచర్లను చూపించొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ టీచర్ పోస్టులు ఇక లేనట్టేనని తెలుస్తోంది. గతంలో జరిగిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లలోని ఖాళీలనూ చూపించేవారు. ఆ స్కూళ్లకు అలాటైన టీచర్లను డిప్యూటేషన్పై ఇతర బడులకు పంపేవారు. కానీ ఈ ఏడాది ఆ విధానాన్ని ప్రభుత్వం మార్చేసి, ఆ పోస్టులను చూపించకపోవడంతో టీచర్ పోస్టులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సర్కారు రిలీజ్ చేసిన జీవోలోనే స్పష్టంగా పేర్కొన్నా, దీనిపై ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి సంఘం కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 131, మహబూబాబాద్ జిల్లాలో 123 ఉన్నాయి. వరంగల్ లో 97, కుమ్రం భీంలో 71, రంగారెడ్డి, సూర్యాపేటలో 58 చొప్పున, ఆదిలాబాద్, జనగామలో 52 చొప్పున ఉన్నాయి. జోగుళాంబ గద్వాలలో మూడు, మేడ్చల్ లో 8, హనుమకొండలో 9 బడులు జీరో అడ్మిషన్ల జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడ్డట్టేనని అధికారులు చెప్తున్నారు. గతంలో మూతపడ్డ స్కూళ్లలోని టీచర్ పోస్టులను డీఈవో పోల్లో పెట్టగా, వాటిని ఖాళీల జాబితాలో చూపించడం లేదు. భవిష్యత్లోనూ ఈ స్కూళ్లదీ అదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.