byసూర్య | Tue, May 17, 2022, 01:52 PM
హైదరాబాద్ నగరపాలక సంస్థను నిధుల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వ ఆస్తుల నుంచి ఆయా శాఖలు సకాలంలో పన్నులు చెల్లించకపోవడంతో సుమారు రూ.5546 కోట్లు బకాయిపడ్డాయి.దీంతో నగరపాలక సంస్థ ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో జాప్యం ఏర్పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆ సంస్థ నిధుల లేమితో ఉత్సవ విగ్రహంలా మారే అవకాశం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ సంస్థలు 87, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 శాఖలు ఉన్నాయి. ఇందులో పలు శాఖలు 25 ఏండ్లుగా పన్నులు చెల్లించడంలేదు. వాటికి నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లింది. అయినా ఎలాంటి పురోగతి లేదు. సంబంధిత శాఖల అధికారులు పన్నుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా ఏటేటా బకాయిలు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా వైద్యశాఖ 23 ఏళ్ల నుంచి నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. అన్ని శాఖల కంటే రూ. 1185.18కోట్ల బకాయితో మొదటి స్థానంలో నిలిచింది. రోడ్లు, భవనాల శాఖ రూ. 1170.05 కోట్లు, పోలీసు శాఖ రూ. 420 కోట్లు, విద్యాశాఖ రూ. 385 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ నుంచి ఏటా రూ. 35 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయినప్పటికీ ఆ శాఖ 21 ఏళ్ల నుంచి నగర పాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. రూ. 894 కోట్లు బాకీ పడింది. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని 30 శాఖల నుంచి నగరపాలక సంస్థకు రూ. 306.28 కోట్ల బకాయి ఉంది.
ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థకు ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది. పెండింగ్లోని ఆస్తి పన్నును చెల్లించేందుకు ప్రజలకు 5 శాతం మినహాయింపు ఇచ్చింది. రూ. 600 కోట్ల వసూళ్లు చేయాలని టార్గెట్గా పెట్టుకొని లక్ష్యాన్ని అధిగమించింది నగరపాలక సంస్థ. రూ.750 కోట్లు వసూలైనట్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను చెల్లింపులో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్ను చెల్లించకపోతే సామాన్యులను ముప్పతిప్పలు పెట్టే అధికారులు ఆయా శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఇళ్లకు తాళాలు వేసినట్లే ఆఫీసులకు సైతం లాక్ వేస్తేనే ఆస్తిపన్ను బకాయిల చెల్లింపులు జరుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆయా శాఖలకు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించడంలో ఆధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రేటర్ నగరపాలక సంస్థకు వేల కోట్లు బకాయిపడ్డాయి. వాటి వసూళ్లపై సర్కారు దృష్టి సారించడంలేదు. అదే సామాన్యులకైతే నోటీసులతో పాటు ఇళ్లకు తాళాలు వేస్తారు. మరి ప్రభుత్వ సంస్థలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని అన్నిశాఖల అధిపతులకు సీఎస్ ఆదేశాలు ఇవ్వాలి.