byసూర్య | Fri, May 13, 2022, 04:57 PM
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్పై హత్య కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ 2013 జూలై 18న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎర్రశేఖర్ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్, అతని సోదరుడు జగన్మోహన్ దంపతులు చింతకుంట సర్పంచ్ పదవికి పోటీకి దిగారు.
ఈ విషయంలో ఇద్దరూ రాజీ కుదరలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎర్ర శేఖర్ భార్య భవానీ జగన్మోహన్ భార్య అశ్విత కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయమై అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి. మాటా మాటా పెరిగి ఎర్ర శేఖర్ జగన్మోహన్పై తన సోదరుడిని కారులో ఎక్కించుకుని విషయం మాట్లాడుతుండగా తుపాకీతో కాల్పులు జరిపాడని అప్పటి ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ 2013 ఆగస్టు 27న ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎర్ర శేఖర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఎర్ర శేఖర్ బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడంతో ఎర్ర శేఖర్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.