byసూర్య | Wed, Oct 27, 2021, 07:53 AM
మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించొచ్చని పేర్కొన్నది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 48గంటల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తాలో ఈ నెల 28న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.