byసూర్య | Tue, Jun 08, 2021, 04:46 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనావైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా.. లాక్డౌన్ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జనం రాకపోకలకు సమయాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్లు సమాచారం.
దీంతోపాటు వైద్యం, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో మరికొన్ని అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశముందని తెలుస్తుంది. వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశముంది. పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.