byసూర్య | Thu, Jun 03, 2021, 03:07 PM
పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. ఓ అనాథ బిడ్డతో పాటు ఆటో కార్మికుని కుటుంబానికి అండగా నిలిచారు. అనాథ బిడ్డకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. మృతి చెందిన ఆటో కార్మికుని కుటుంబానికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథను కొన్నేండ్ల క్రితం సిద్దిపేటలోని బాలసదనంలో హరీష్ రావు చేర్పించారు. నాటి నుంచి నేటి వరకు అన్ని తానై అండగా నిలిచారు హరీష్ రావు. భాగ్య తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నది. గత ఏడాదే ఆమెకు పెళ్లి కూడా చేశారు మంత్రి. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా.. భాగ్యకు మంత్రి హరీష్ రావు కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా అందించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ పిడిశెట్టి దురయ్య కుటుంబానికి అండగా నిలిచారు. ఆటో కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను దుర్గయ్య కుటుంబానికి హరీష్ రావు అందించారు. ఆటో డ్రైవర్లు ఆత్మవిశ్వాసంతో బతకాలన్న ఉద్దేశంతో.. తన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి.. ఆటో కో ఆపరేటివ్ సోసైటీని హరీష్ రావు ఏర్పాటు చేశారు. ఆ సొసైటీ ద్వారా కార్మికులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు.