byసూర్య | Mon, Jan 18, 2021, 04:10 PM
కరోనా భయం ప్రజల్ని వదలడం లేదు. కేసుల సంఖ్య తగ్గుతున్నా ప్రజలు మాత్రం ఇంకా భయంతోనే గడుపుతున్నారు. హైదరాబాద్లో ఓ కోవిడ్ పెషేంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకి బలవనర్మణం చెందాడు. వేములవాడకు చెందిన 77 ఏళ్ల నారాయణ.. హైదరాబాద్లోని కొండాపూర్లో నివాసం ఉంటున్నాడు. వ్యాపారిగా జీవనం సాగిస్తున్న అతడికి ఇద్దరు కొడుకులు. అయితే ఇటీవల కరోనా సోకడంతో కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిల్డింగ్ రెండో అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆస్పత్రి యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్న పేషేంట్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్లో బుధవారం చేరినట్లు తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడ పనిచేస్తున్న నర్సు మెడికేషన్కు సిద్దం చేస్తోంది. అయితే ఆ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ 19 వార్డు నుంచి దూకి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి సిబ్బంది షాక్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.