byసూర్య | Tue, Jan 22, 2019, 03:43 PM
భువనేశ్వర్: ఒడిశాలోని కందమల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..గడాపూర్ నుంచి బ్రాహ్మణిగావ్ వెళ్తున్న ఓ ట్రక్కు బలిగూడ సమీపంలో పొయిగూడ ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఘాట్రోడ్డులో మలుపుతిప్పే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా ట్రక్కు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం బెర్హంపూర్కు తరలించారు.