byసూర్య | Sat, Jan 19, 2019, 12:58 PM
సీఎల్పీ నాయకుడి ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించాము.. ఆయన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. భట్టి విక్రమార్కకి డిప్యూటీ స్పీకర్ గా చేసిన అనుభవం ఉందని, ఇప్పడున్న పరిస్ధితుల్లో సీఎల్పీ నాయకుడిగా భట్టి నియామకం సరైనదే అని కోమటిరెడ్డి అన్నారు. పదవి ఆశించడంలో తప్పులేదని కానీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు నష్టం చేసిందని కోమటిరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లు జరిగాయని చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యత చేయడం సరికాదన్న కోమటిరెడ్డి అధిష్టానం కూడా కొంత ముందే అభ్యర్ధులను ప్రకటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. సీట్ల కేటాయింపులో కూడా కొన్ని లోపాలు జరిగాయన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అన్న విషయాన్ని మా జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని, పీసీసీ మార్పు మా పరిధిలో వ్యవహారం కాదని అది అధిస్టానం చూసుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.