by సూర్య | Tue, Aug 20, 2019, 12:45 PM
చిత్రపరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం అగ్ర హీరోలు సైతం ఈ బయోపిక్ ల మోజులోనే ఉన్నారు. భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ రహీం. ప్రస్తుతం బాలీవుడ్లో ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ను అజయ్ దేవగణ్ సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమాను నిర్మించనున్నట్లు బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియో 2018 జులైలోనే ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన వివరాల కోసం అజయ్, ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు అజయ్ తన ట్విటర్లో ఫస్ట్లుక్ను పోస్ట్ చేస్తూ మైదాన్ కిక్స్ ఆఫ్ టు డే అని ట్వీట్ చేశారు. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ రహీం నాయకత్వంలో 1951, 1962 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టు విజయం సాధించింది.
Latest News