by సూర్య | Fri, Jun 21, 2019, 07:50 PM
ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ కాంత్ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలకు క్రేజ్ ఉండేది. ఇది ఇలా ఉండగా.. విజయ్ కాంత్ ఆస్తులను ఓ జాతీయ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇది చూసిన అభిమానులు షాకయ్యారు. రూ.5 కోట్ల అప్పు కట్టకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు వార్తల్లో రాసుకొచ్చారు. 'ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' పేరుతో విజయ్ కాంత్ ఓ సంస్థను నడిపిస్తున్నారు. దీనిపేరు మీద ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు.
అయితే డబ్బు సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో ఆయనకి సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. ఆస్తుల వేలానికి పర్మిషన్ ఇస్తూ.. విజయ్ కాంత్, అతడి భార్య ప్రేమలతా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అభిమానులు కొందరు విజయ్ ఆస్తులను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.
సినిమాల తరువాత విజయ్ కాంత్ 'డిఎండికె' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో డిఎండికే పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు బరిలో నిలవగా ఘోరంగా ఓడిపోయారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఆస్తుల అమ్ముకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Latest News