by సూర్య | Mon, Dec 04, 2023, 12:03 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విడుదలకు ముందు ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో కూడా తెలిసిందే. ‘పుష్ప’, ‘టైగర్ నాగేశ్వరరావు’ల బాటలోనే ఇప్పుడు అల్లరి నరేష్ నడవబోతున్నాడు. కొంతకాలంగా కామెడీని పక్కనెట్టి.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్న అల్లరి నరేష్.. ఇప్పుడో పెరటి దొంగ బయోపిక్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అల్లరి నరేష్ పెరటి దొంగగా నటిస్తోన్న చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. అల్లరి నరేష్ హీరోగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ‘సామజవరగమన’ మూవీతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న హాస్య మూవీస్ బ్యానర్పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేకర్స్ టైటిల్ లుక్ పోస్టర్ని కూడా వదిలి.. సినిమాపై ఇంట్రస్ట్ని క్రియేట్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్పై టైటిల్ రాసి ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం అల్లరి నరేష్ సరికొత్తగా మేకోవర్ అయినట్లుగా తెలుస్తోంది.
Latest News