by సూర్య | Sat, Aug 06, 2022, 04:10 AM
క్యాసినో కేసు వ్యవహారం కీలక మలుపుతిరుగుతోంది. ప్రముఖులతో క్యాసినో ఆడిస్తూ అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్న చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా చీకోటి ప్రవీణ్ వెల్లడించిన వివరాల మేరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా శనివారమే తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో ప్రజా ప్రతినిధులను ఈడీ అధికారులు కోరారు. ఈడీ నోటీసులు జారీ అయిన ప్రజా ప్రతినిధుల్లో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. ఈడీ నోటీసులు జారీ అయిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే పేర్లు మాత్రం వెల్లడి కాలేదు.
Latest News