by సూర్య | Sat, May 21, 2022, 01:57 PM
మహిళ అని కూడా తమ పని మనిషిపై యజమానులు దాష్టీకం ప్రదర్శించారు. ఆమెను నిత్యం కొడుతూ శరీరమంతా తీవ్రగాయాలు చేశారు. రోజుల పాటు గదిలో నిర్బంధించి దాడులు చేయడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఇంటి వద్ద దించేసి, చేతులు దులుపుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దేశ రాజధాని పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని రాజౌరీ గార్డెన్లో అభిజిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వారి వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన రజిని అనే మహిళ పనిమనిషిగా చేరింది. ఆమెకు నెలకు రూ.7 వేలు ఇచ్చేందుకు యజమానులు అంగీకరించారు. అయితే కొంత కాలంగా రజినిపై యజమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఆమెను నిత్యం చిత్రహింసలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వారి దెబ్బలకు ఆమె శరీరమంతటా గాయాలయ్యాయి. రజిని కుటుంబం ఢిల్లీలో ఉంటున్న అద్దె ఇంటి ముందు ఆదివారం (మే 15)న రోడ్డుపైనే ఆమెను పడేసి వారు వెళ్లిపోయారు.
అపస్మారిక స్థితిలో ఉన్న బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆమె గురువారం ఢిల్లీ పోలసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గతంలోనూ ఓ పనిమనిషి పట్ల వారు ఇలాగే ప్రవర్తించారని తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Latest News