by సూర్య | Mon, Jan 17, 2022, 03:56 PM
పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలని అన్ని పార్టీలు కోరిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 16న వారణాసిలో గురు రవిదాస్ జీ జయంతి వేడుక కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లనున్నారు. వారంతా వారం ముందే వారణాసి బయల్దేరతారు. దాంతో ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్ కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పోలింగ్ తేదీని మార్చాలంటూ ఎన్నికల సంఘానికి భారీ ఎత్తున విజ్ఞప్తులు అందాయి. దీనిపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ, బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కూడా ఈసీకి లేఖ రాశారు. భక్తుల వినతులను, రాజకీయ పక్షాల లేఖలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసింది. పంజాబ్ లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుపనున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొంది.
Latest News