by సూర్య | Mon, Jan 17, 2022, 12:19 PM
తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని అడగడమే ఆ మహిళ చేసిన నేరం. అప్పు చెల్లించాలని అడిగిన మహిళకు వివాహేతర సంబంధం అంటగట్టి ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లల చావుకు కారణం అయ్యారు ఓ దంపతులు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. భద్రావతి తాలూకాలోని యదేహళ్లి ప్రాంతానికి చెందిన వీణా(32) అనే వివాహితకు ఏడేళ్ల పాప, ఏడాది వయసున్న మరో పాప ఉంది. సంక్రాంతికి పుట్టింటికి అని చెప్పి వీణా తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని ఇంట్లో నుండి జనవరి 13న బయలుదేరింది. అయితే అనూహ్యంగా జనవరి 14న హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో ఆమె శవం లభ్యమైంది. ఏడేళ్ల పాప మృతదేహం చెన్నగిరి తాలూకాలోని నల్లూర్ సమీపంలో వెలుగుచూసింది. మరో పాప మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటనపై వీణా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య, పిల్లల చావుకు హొలేహోన్నురు సమీపంలోని అరహతొళలు గ్రామానికి చెందిన సంతోష్, అతని భార్య ఆషా కారణం అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారికి తన భార్య రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చిందని చెప్పాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే తన భార్యకు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నాడు. వారి ప్రచారంతో చాలా మంది తన భార్య నిజంగానే తప్పుడు పని చేసిందని భావించారని ఈ పరిణామాలతో తన భార్య తీవ్రంగా మానసిక వేదనకు గురైందని చెప్పాడు. వీటన్నింటిని పట్టించుకోవద్దని తాను ధైర్యం చెప్పానని పోలీసులకు వివరించాడు. పుట్టింటికి వెళ్తానంటే ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుందని భావించానని కానీ ఇంతలోనే ఈ ఘోరం చూడాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందాడు. వీణా భర్త ఫిర్యాదుతో పోలీసులు సతోష్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Latest News