by సూర్య | Fri, Jan 14, 2022, 10:45 PM
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం ఊహించని వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం సంభవించిందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గత డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. కాగా ఈ ఘటనపై త్రివిధ దళాల కోర్టు విచారణ నివేదిక వెల్లడైంది. ప్రమాదంలో యాంత్రిక వైఫల్యం లేదని, హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు లేవని, సిబ్బంది నిర్లక్ష్యం కూడా లేదని తేలిందని భారత రక్షణశాఖ తెలిపింది. ఊహించని వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం సంభవించిందని స్పష్టం చేసింది. ఒక్కసారిగా భిన్న వాతావరణం ఎదురయ్యేసరికి పైలెట్లు అయోమయానికి గురయ్యారని, హెలికాప్టర్ ను మబ్బుల్లోకి తీసుకెళ్లారని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని వివరించింది. ఫ్లయిట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లను విశ్లేషించాకే నివేదిక రూపొందించినట్టు తెలిపింది.
Latest News