by సూర్య | Fri, Jan 14, 2022, 09:21 PM
తమిళం సమన్వితమైన భాష అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు. తాజాగా ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమిళ భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తమిళం ఎంతో శక్తి సమన్వితమైన భాష అని అభివర్ణించారు. ఇతర భాషల్లో ఎంతో ప్రయాసకోర్చి ఓ భావాన్ని వెల్లడిస్తే, తమిళంలో చిన్న పదబంధంతో ఆ భావాన్ని వ్యక్తపరచవచ్చని ఆనంద్ వివరించారు. "నువ్వు చెప్పే చెత్త వివరణ, నీ సోదిని భరించే ఓపిక నాకు లేదు, నన్ను వదిలేస్తే సంతోషిస్తా" అని ఇంగ్లీషులో చెప్పడం కంటే... తమిళంలో "పోడా డేయ్" (పోరా రేయ్) అని ఒక్కముక్కలో చెప్పడమే తనకిష్టమని వెల్లడించారు. తాను పాఠశాల విద్యను తమిళనాడులోనే అభ్యసించానని, తాను మొదట నేర్చుకున్నది 'పోడా డేయ్' అనే ఈ మాటనే అని తెలిపారు. చాలా ఎక్కువసార్లు ఆ పదబంధం ఉపయోగించేవాడ్నని, తన జీవితంలో చాలా సందర్భాల్లో 'పోడా డేయ్' అనాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు గట్టిగా అరిచి చెప్పేవాడ్నని తెలిపారు. అది అంతలా తనతో మమేకమైపోయిందని వివరించారు.
Latest News