బ్రిటన్ కు భారతీయుడు ప్రధాని అయ్యే అవకాశం

by సూర్య | Fri, Jan 14, 2022, 06:53 PM

బ్రిటన్ దేశానికి మన భారతీయుడు అందులోనూ తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బ్రిటన్ రాజకీయాలపై విశ్లేషకుల కథనాలు ఇవే స్పష్టంచేస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఉద్వాసన కత్తి వేలాడుతోందా? తదుపరి ప్రధాని అయ్యే అవకాశం భారత సంతతి వ్యక్తికి రానుందా? అంటే అవుననే అక్కడి వార్త సంస్థలు కథనాలను రాస్తున్నాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి అయిన రుషి సూనక్.. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నారు. కారణం 2020 మేలో 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన ఆఫీసులో కరోనా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నా మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు బోరిస్ మెడకు చుట్టుకున్నాయి.  స్వయంగా ప్రధానే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం పట్ల అటు ప్రతిపక్షం లేబర్ పార్టీ, ప్రజలతో పాటు సొంత పార్టీ కన్జర్వేటివ్స్ లోని నేతల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. వెంటనే ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్ లో క్షమాపణలు కూడా చెప్పారు. అది ఆఫీసు నిర్ణయాలపై చర్చ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీయేనని, అంతేగానీ ఉద్దేశపూర్వకంగా పెట్టుకున్న పార్టీ కాదని వివరించారు. కాగా, ఆఫీసులో పార్టీ చేసుకున్న వ్యవహారంపై సీనియర్ సివిల్ సర్వెంట్ స్యూ గ్రే ఆధ్వర్యంలో ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే బుధవారం జరిగిన సభకు రుషి మాత్రం హాజరు కాలేదు. కావాలనే ఆయన సభకు రాలేదన్న ఆరోపణలు వినిపించాయి. వాటిపై ట్విట్టర్ లో స్పందించిన రుషి.. ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు సమావేశాలకు హాజరయ్యానని, దాంతో పాటు దేశంలో విద్యుత్ పరిస్థితిపై ఎంపీలతో చర్చించానని, అందుకే సభకు రాలేకపోయానని వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పేందుకు ప్రధానికి అర్హత ఉందని, ఆ నిర్ణయానికి తాను మద్దతిస్తానని చెప్పారు. ఇదిలావుంటే బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పిన తర్వాత యూగవ్ అనే సంస్థ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో పదింట ఆరుగురు.. బోరిస్ దిగిపోవాలని తేల్చి చెప్పారు. ప్రధాని చెప్పిన సమాధానాల్లో నిజాయతీ లేదని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒకవేళ బోరిస్ దిగిపోతే తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగులూ సాగుతున్నాయి. దాని ప్రకారం రుషి సూనక్ ముందు వరుసలో ఉన్నారు. మరో భారత సంతతికి చెందిన మంత్రి ప్రీతి పటేల్ కూడా ఆ రేసులో నిలిచారు. రుషి సూనక్ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్, జాన్సన్ కేబినెట్ లో కీలక వ్యక్తి అయిన మైకేల్ గోవ్, మాజీ విదేశాంగ, ఆరోగ్య శాఖ మంత్రి జెరిమీ హంట్, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్ లు ప్రధాని పదవి రేసులో ఉన్నారు. వీళ్లందరిలోనూ రుషీ సూనక్ కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM